CHILD MARRIAGE: ఏడేళ్ల బాలిక విక్రయం.. రూ. 4.5 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకున్న 38 ఏళ్ల వ్యక్తి

Child Marriage: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా బాల్య వివాహాలు ఆగడం లేదు. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ దేశంలోని ఏదో ఓ మూల గుట్టు చప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ 38 ఏళ్ల ప్రబుద్ధుడు.. ఏడేళ్ల వయసున్న బాలికను వివాహం చేసుకున్నాడు. బాలిక కుటుంబానికి రూ. 4.50 లక్షలు చెల్లించిన ఆ వ్యక్తి.. ఆమెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.

ఏం జరిగింది

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఏడేళ్ల బాలికను భూపాల్ సింగ్ అనే 38 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు. బాలికను అప్పగించినందుకు ఆమె తండ్రికి రూ.4.50 లక్షలు చెల్లించాడు. అనంతరం మే 21 న బాలికను భూపాల్‌ సింగ్‌ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తమకు మంగళవారం సమాచారం అందినట్లు ధోల్‌పూర్‌ జిల్లా ఎస్పీ మనోజ్‌ కుమార్‌ వెల్లడించారు.

అధికారుల చర్యలు

సమాచారం అందిన వెంటనే మానియా డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ దీప్‌క్‌ ఖండేల్వాల్‌ నేతృత్వంలోని పోలీసు బృందం భూపాల్ సింగ్ ఇంటికి వెళ్లినట్లు వివరించారు. ఆ సమయంలో బాలిక ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు. ఆమె చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుని ఉన్నట్లు చెప్పారు. ఏడేళ్ల వయసులో తనకు పెళ్లి అయిందన్న విషయం కూడా తెలియదని.. ఆడుకుంటూ ఉందని తెలిపారు.

కేసు నమోదు

బాలిక విక్రయం, బాల్య వివాహానికి సంబంధించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికను అక్కడి నుంచి రెస్క్యూ హోం కు తరలించినట్లు చెప్పారు. ఘటనకు కారణమైన భూపాల్‌సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ ఘటనలో ఎంతమంది ప్రమేయం ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు అనంతరం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

2023-05-24T13:58:05Z dg43tfdfdgfd