ఇంట్లో ఈ ఫిష్ కర్రీ మసాలా వాడుతున్నారా? అయితే, జర భద్రం!

భారత్‌లో తయారైన ప్రముఖ బ్రాండ్ ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుమందు అవశేషాలు అధిక స్థాయిలో ఉన్నాయని సింగ్‌పూర్ ఆరోపించింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను వెనక్కి పంపింది. మసాలా మిశ్రమంలో మానవ వినియోగానికి పనికిరాని పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ అధిక స్థాయిలో ఉందని ఆరోపణలు చేసింది. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ జారీ చేసిన నోటిఫికేషన్‌‌కు ప్రతిస్పందనగా చర్య తీసుకున్నట్టు ఈ మేరకు ఓ ప్రకటన జారీచేసింది. ఫిష్ మసాలాలో పరిమితులు దాటి ఇథిలీన్ ఆక్సైడ్ ఉనికి అధికంగా ఉందని హైలైట్ చేసింది.

‘భారత్‌లో తయారైన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ స్థాయిలు నిర్దేశిత పరిమితికి మించి ఉన్నాయన్న హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ జారీచేసిన నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా వాటిని తిప్పి పంపుతున్నాం’ అని సింగ్‌పూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) తన ప్రకటనలో పేర్కొంది. ఉత్పత్తులను వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించాలని ఎస్పీ ముత్తయ్య అండ్ సన్స్ ప్రయివేట్ లిమిటెడ్‌కు సూచించింది.

ఇథిలీన్ ఆక్సైడ్ సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులను సూక్ష్మజీవుల నాశనం చేయకుండా ఉండేందుకు పురుగుమందుగా ఉపయోగిస్తారు. అయితే ఆహార ఉత్పత్తుల్లో మాత్రం దీని వినియోగంపై నిషేధం విధించారు. సింగపూర్ నిబంధనల ప్రకారం.. మసాలా దినుసుల స్టెరిలైజేషన్‌లో అనుమతించదగిన స్థాయిలో ఉన్నప్పటికీ, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో అధిక మొత్తంలో ఉండటం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని SFA తెలిపింది.

ఈ ఉత్పత్తులను వినియోగించి, తమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందే వ్యక్తులు వైద్య సలహా తీసుకోవాలి... వినియోగదారులు విచారణల కోసం వారి కొనుగోలు కేంద్రాన్ని సంప్రదించాలి’ అని ప్రకటనలో పేర్కొంది. కాగా, దీనిపై ఇంకా స్పందించని ఎవరెస్ట్ సంస్థ.. ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-19T07:20:47Z dg43tfdfdgfd