తోబుట్టువులను కోట్లలో మోసం.. హార్దిక్ పాండ్యా సోదరుడి రిమాండ్ పొడిగింపు

తోబుట్టువులను కోట్లలో మోసం.. హార్దిక్ పాండ్యా సోదరుడి రిమాండ్ పొడిగింపు

బిజినెస్ పేరుతో తోబుట్టువులు హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాలను వారి సోదరుడు వైభవ్‌ పాండ్యా రూ.4.3 కోట్ల మేర మోసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాండ్యా సోదరులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వైభవ్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఈ కేసును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. 

మంగళవారం(ఏప్రిల్ 16) ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) వైభవ్‌ను మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి, అతని పోలీసు కస్టడీని పొడిగించాలని అభ్యర్థించింది. వైభవ్ వేరు వేరు ప్రాంతాలకు డబ్బును బదిలీ చేశాడని, దానిని గుర్తించాల్సి ఉందని ఈఓడబ్ల్యూ అధికారులు కోర్టుకు తెలిపారు. అందుకు వైభవ్‌ తరపు న్యాయవాది అభ్యంతరం చెప్పకపోవడంతో  కోర్టు.. అతని రిమాండ్‌ను శుక్రవారం(ఏప్రిల్ 19 ) పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఏంటి ఈ వ్యాపారం..?

రెండేళ్ల క్రితం అనగా.. 2021లో హార్దిక్‌, కృణాల్‌, వైభ‌వ్‌ పాండ్యాలు క‌లిసి పాలిమర్ వ్యాపారం మొద‌లుపెట్టారు. ఇందులో హార్దిక్, కృనాల్‌ 40 శాతం చొప్పున, వైభ‌వ్ 20 శాతం పెట్టుబడి పెట్టారు. పెట్టిన పెట్టుబ‌డి ప్రకారం వ‌చ్చిన లాభాలు పంచుకోవాలని మొదట నిర్ణయించుకున్నారు. అయితే, కొన్నాళ్లు గడిచాక వైభ‌వ్ తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. సోద‌రులకు తెలియ‌కుండా రూ.4.3 కోట్ల నిధుల‌ను దారి మ‌ళ్లించాడు. ఆ నిధుల‌తో మరో వ్యక్తితో కలిసి అదే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. దీని కారణంగా అసలు సంస్థ నష్టాల బాట పట్టింది. హార్దిక్, కృనాల్‌లకు రూ.3 కోట్ల నష్టం వాటిల్లగా.. వైభవ్ సొంత కంపెనీ లాభం 20-33 శాతం పెరిగింది.

నష్టాలు ఎందుకొచ్చాయని తమ్ముళ్లు లెక్కలు ఆరాతీయగా.. నిధులు దారి మళ్లిన సంగతి వెలుగులోకి వచ్చింది. దీనిపై అతన్ని నిలదీయగా బెదిరింపులకు దిగాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, కాదని ఎవరికైనా చెప్తే వారి ప్రతిష్టను దిగజారుస్తానని బెదిరింపులకు దిగాడు. దీనిపై పాండ్యా సోదరులు ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు... సెక్షన్‌ 420, 406, 408, 465, 467, 471, 34, 120 B, మరియు 506 కింద కేసులు నమోదు చేశారు. తదుపరి ఈ కేసు ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేయబడింది.

©️ VIL Media Pvt Ltd.

2024-04-17T10:44:43Z dg43tfdfdgfd